భారతీయ అగ్రకులాలమీద స్వామి వివేకానందుని (నా ఐరోపాయాత్ర నుండి) వ్యాఖ్యలు: (రామకృష్ణమఠం ప్రచురణ; ’’సోదర సోదరీమణులారా’’ అనే సాహిత్య సంకలనం నుండి గ్రహించబడినది.)
ఆర్యులనుంచి నేనుద్భవించానని నువ్వెంత అరచినా, ప్రాచీన భారత దేశాన్ని గురించి నువ్వు రాత్రింబవళ్ళు ఎంత సంకీర్తనం చేసినా, నీ జన్మకు నీవెంత విర్రవీగినా, ఉత్తమ కులానికి చెందిన ఓ భారతీయుడా! నువ్వు, నీ తోడి వారు, ఇంకా బతికిఉన్నారనుకొంటున్నావా? మీరంతా పదివేల సంవత్సరముల ముసలమ్మలు! మీ పూర్వులు; "నడయాడే శవాలని’ ’ యెవరిని నిందించారో, నిజంగా వారిలోనే యిప్పటికీ ఏ కొంచమో జీవశక్తి కనబడుతోంది. నిజంగా "నడయాడేశవాలు’’ మీరే! మీ యిళ్ళు వాటిలోని వస్తుసామగ్రి పురాతన వస్తుప్రదర్శనశాలలో ప్రదర్శయోగ్యాలు! అవి అంత నిర్జీవాలు! ప్రాచీనాలు! మీ పద్దతులను ప్రవర్తనలను, కదలికలను, జీవిత పోకడలను కళ్ళారా చూస్తున్నవాడు, తానేదో బొమ్మచెప్పే కథలను వినేట్లుగా భావిస్తాడు! మీతో ప్రత్యక్ష్య పరిచయం తరువాత యింటికొచ్చి యెవరైనా, తానంతకుపూర్వం ఒక పురాతన చిత్రశాలకు వెళ్ళి బొమ్మలను చూసివచ్చానా? అని సందేహంలో పడతాడు. ఈ మాయాలోకంలో, ఉత్తమకులానికిచెందిన భారతీయులైన మీరే నిజమైన మాయాబొమ్మలు! ఎడారిలోని యెండమావులు. మీరు భూతకాలానికీ దాని వైవిధ్యాలకు ప్రతినిధులు. మీరింకా కనబడటం; అజీర్నంవల్ల కలిగిన ఒక దారుణ పీడకల. మీరు వట్టి శూన్యులు, భవిష్యత్తులోని ఒట్టి గాలిమూటలు. స్వప్నలోకనివాసులట! మీరింకా ఎందుకిక్కడ మసలుతున్నారు? మీలో మాంసం నెత్తురు లేవు! వట్టి పురాతన భారతదేశ బొమికలగూళ్ళుమీరు! మీరు త్వరగా దుమ్మై గాలిలొ ఎందుకు కలసిపోరు? మీ కంకాళం వేళ్ళకు, కొన్ని అమూల్యమైన రత్నపుటుంగరాలు ఉన్నాయి. అవి మీ పూర్వులు సంపాదించిపెట్టినవి. మీ దుర్వాసనాభూయిష్టమైన శవాల కౌగిలింతలో, ఎన్నో ప్రాచీన రత్నపేటికలు పదిలపరచబడ్దాయి! యిప్పటివరకు మీకువాటిని యితరులకు అప్పగించే సమయం చిక్కలేదు. యిప్పుడు ఈ ఆంగ్లేయుల పరిపాలనలో, ఈ ఉచిత విద్యావిధానపు రోజుల్లో, ఈవెలుగులో వాటిని మీ వారసులకు అప్పగించండి; వీలైనంత త్వరలో ఆ పని చేయండి. చేసి మీరు శూన్యంలో కలసిపొండి. మాయమైపొండి. మీ స్థానంలో నూతన హిందూదేశం ఉధ్బవించనివ్వండి. నూతన భారతదేశం తలయెత్తనివ్వండి. నాగలి చేతబట్టిన రైతుల గుడిసెల నుండి, బెస్తవారి పూరి పాకలనుండి, చెప్పులు కుట్టేవారి పూరిళ్ళనుండి, పాకీవాళ్ళ గుడిసెల నుండి నవీన భారత దేశం ఉద్భవించనీ! వర్తకుని దుకాణం నుండి, పెసరట్టు అమ్ముకునేవాడి పెనం నుండి, నూతన హిందూదేశం జన్మించనీ! కార్మాగారాలనుండి, విపణీవీధులనుండి. తోటలనుండి, అడవులనుండి, గుట్టలనుండి, పర్వతాలనుండి, నూతన భారతదేశం తలయెత్తనీ. ఈ జనసామాన్యం వేల సంవత్సరాలనుండీ అణగదొక్కబడి కిక్కురుమనకుండా సహిస్తూ వచ్చింది. ఫలితంగా వారిలో అద్భుతమైన సహనశక్తి అలవడింది. అచిరకాల దుఃఖానుభవ ఫలితంగా వారిలో అనంతమైన జీవశక్తి నెలకొంది. గుప్పెడు ధాన్యంగింజలతో పొట్టపోసుకొని వారు ప్రపంచాన్నంతా తలక్రిందులు చేయగలరు. వారికి చిన్న రొట్టెముక్క పెట్టండి, చాలు. ఈ సమస్త ప్రపంచం వారి శక్తికి చాలదు. వారు రక్తబీజుడి మాదిరి, అనంతమైన జీవశక్తి కలవారు. దీనికితోడు ప్రపంచంలో మరెక్కడా లభ్యంకాని పరిశుద్దమైన నైతిక జీవిత బలం కూడా వారికుంది. అలాంటి శాంతి. త్రుప్తి, ప్రేమ, ఏక ధాటిగా, నిశ్శబ్దంగా పనిచేసే అలాటి శక్తి, అవసర సమయాల్లో అ సింహబల ప్రదర్శనం - ఇవన్నీ మీకెక్కడ కనిపిస్తాయి? ప్రాచీన అస్తి పంజరాలైన మీముందు, మీ వారసులు, భవిష్యద్భారతదేశం ఉన్నాయి. ఆభవిష్యత్భారతదేశ వాసులకు మీ రత్నపేటికలను, మీ రత్నపుటుంగరాలను అందించండి, త్వరగా అందించి అంతర్దానమైపొండి! కానీ అదృష్యులై ఉరికే మీ చెవులు మాత్రం రిక్కించి వినండి. మీరు మాయమైన మరు క్షణమే భారతదేశ పునరుజ్జీవన ప్రారంభతూల్యారావం, కోటి పిడుగుల ధ్వనికి సమానమై, విశ్వాంతరాళంలో ’గురు జయ! గురు జయ!’ అని మారు మ్రోగే విజయనాదం ప్రతిధ్వనించటం ఆలకించండి.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి